కావేరి చిచ్చుకు కారకులెవరు ?

న్యూఢిల్లీ: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి వివాదం మళ్లీ రాజుకుంది. ఒక రాష్ట్రానికి చెందిన వాహనాలను మరో రాష్ట్రానికి చెందిన ప్రజలు లేదా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు దగ్ధం చేస్తున్నారు. విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ వివాదం ఇప్పటిది కాదు. బ్రిటిష్‌ వలసపాలకుల నాటి నుంచి కొనసాగుతున్నదే. వ్యవసాయానికి జల వనరుల కొరత ఏర్పడినప్పుడల్లా వివాదం భగ్గుమంటూనే ఉంటోంది.
వాస్తవానికి కావేరి జల వివాదం కర్ణాటక, తమిళనాడుతోపాటు పుదుచ్ఛేరి, కేరళ రాష్ట్రాలకు చెందినది. గొడవలు మాత్రం ఎప్పుడూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్యనే జరుగుతాయి. కావేరి ప్రాదేశిక ప్రాంతంలో తమిళనాడు రైతులు జల వనరులు ఎక్కువగా అవసరమయ్యే పంటలనే వేయడం, కర్ణాటక రాష్ట్రంలో పట్టణీకరణ పెరిగి జల వనరుల కొరత ఏర్పడడంతో ఇరు రాష్ట్రాల మధ్యనే ఎక్కువగా వివాదం కొనసాగుతోంది. ఈ సమస్యను మొదటిసారి పరిష్కరించేందుకు 1991లో కావేరి ట్రిబ్యునళ్‌ను ఏర్పాటు చేశారు. అది సమస్య పరిష్కారానికి ఓ ఫార్ములాను సూచించింది. ఎన్నికల ప్రయేజనమే పరమావధిగా భావించిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ ఫార్ములాతో సంతృప్తి చెందలేదు.
1997లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఏ ముఖ్యమంత్రి కూడా కొంతైన రాజీ ధోరణని కనబర్చకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2012లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమయ్యారు. కొంతమేరకు పురోగతి సాధించినప్పటికీ ముఖ్యమంత్రులు శాశ్వత పరిష్కారానికి రాలేకపోయారు. చివరకు 2013లో కావేరి ట్రిబ్యునల్‌ సమావేశమైన గతంలో తాము సూచించిన ఫార్ములాకు కాస్త మెరగులు దిద్ది అధికారికంగా ఆ ఫార్ములాను నోటిఫై చేసింది.
ఈ మూడేళ్లకాలంలో సమస్య రాజుకోలేదు. ఇప్పుడు మళ్లీ రగులుకుంది. ట్రిబ్యునళ్లు, హైకోర్టులు, సుప్రీం కోర్టు కావేరి సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ అధికారంలోవున్న రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. ఇరు రాష్ట్రాల రాజకీయ మూలాలు కావేరి సమస్యతో ముడిపడి ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ కావేరి సమస్య ఓ ఆయుధం అవుతోంది. పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు అనవసరంగా ఆందోళనల పేరిట బలవుతున్నారు.

No comments